News

ఉగ్ర రక్కసుల విచక్షణా రహిత కాల్పులు


అది పాకిస్తాన్‌ దేశపు పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌. మంగళవారం ఉదయం అప్పుడే మొదలైన తరగతులు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. కొంతమంది విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఇంకొంతమంది ప్రాక్టికల్స్‌ చేస్తున్నారు. మరికొంతమంది పరీక్షలు రాస్తున్నారు. ఒక్కసారిగా ఆరుగురు తాలిబాన్‌ ఉగ్రవాదులు వెనుకగేటు నుంచి సైనిక దుస్తుల్లో పాఠశాలలోకి చొరబడ్డారు. గ్రెనేడ్లు విసురుతూ విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్‌ సంఘటనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉగ్ర రక్కసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. క్లాసుల్లోకి వెళ్లి మరీ విద్యార్థులను కిరాతకంగా కాల్చి చంపారు. అప్పటిదాకా కళకళలాడుతున్న ఆ విద్యాలయంలో రక్తం ఏరులై పారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 140కి మందికి పైగా బాలబాలికలను బలిగొన్నారు. వందలాది మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. టీవీల్లో ఈ ఘోర కృత్యాన్ని చూసిన ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. అమాయక విద్యార్థుల శవాల కుప్పలను చూసి గుండెలవిసిపోతున్నాయి. చిన్నారులను చిదిమేసిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి ప్రతి ఒక్కరి హృదయం బాధతో బరువెక్కింది. ప్రతీకారం కోసమే బాలలను బలిగొన్నామంటూ తాలిబాన్‌ కిరాతకులు చేసిన ప్రకటన గుండెలను కుతకుతలాడిస్తోంది.